పండుటాకు లా ఆ మహానుభావుడు కళ్ళెదురుగా అక్కడ కూర్చుని మాటే పాట లా మాట్లాడుతూ మధ్య మధ్య లో కొన్ని పాటలు పాడుతూ ఉంటే నాకు ఒళ్ళంతా కళ్ళు చెవులూ ఉంటే ఇంకా ఎంత బాగా ఆస్వాదించవచ్చో కదా అనిపించింది. నేను ఒక ఇరవైనిముషాలు ప్రోగ్రాం మిస్ అయ్యాను కానీ విన్నా ఆ కాస్తా చాలు అని అనిపించే లాటి పాటలు పాడారు ఆయన. నర్తనశాల నుండి "సలలిత రాగ సుధా రస.." పాట కి సునీత కూడా గొంతు కలిపి, తన అదృష్టానికి పొంగి పోయింది. తత్వాలు పాడుతూ ఆయన మాదేవ శంభో... అన్న చోట భో అంటూ దీర్ఘం తీసినపుడు సాక్షాత్తూ శంఖం నుండి వచ్చే ఓంకార నాదాన్ని పలికించి అబ్బుర పరచారు. ఈ వయసు లో కూడా ఆయన గాత్ర ధాటి ఏమాత్రం తగ్గలేదు. నా అదృష్టమో లేక తను కూడా సమయం తక్కువ కనుక ఆ థిల్లాన ఎంచుకున్నారో కానీ నా బ్లాగ్ లో లిరిక్స్ ఇచ్చిన బృందావని తిల్లానా ని ఆ కార్యక్రమం లో పాడారు, నాకు చాలా సంతోషం వేసింది.
ఇక మధ్య మధ్య లో చిన్న చిన్న చతురోక్తుల తో ఆసక్తికరంగా సాగింది. మీరు సినిమాల లో ఎక్కువ ఎందుకు చేయలేదు అంటే .. "ఏం చేయమంటావమ్మా ఒక సారి నారద పాత్ర చేశా కదా అని అన్ని అవే వస్తున్నాయ్, హీరోయిన్ లేకుండా నేను ఎందుకు చేయాలి? నేను చేయను.. హీరోయిన్ ఉన్న పాత్ర తీసుకురండి తప్పకుండా చేస్తాను అన్నాను అంతే నన్ను పిలవడం మానేశారు...ఇప్పుడైనా సరే అదే చెప్తున్నాను హీరోయిన్ ఉన్న పాత్ర చూపించండి ఎందుకు చేయనూ.. ఏం చేయలేనా.. " అంటూ హాస్యమాడటం ఆయనకే చెల్లింది. మొత్తం మీద కార్యక్రమం అంతా వొళ్ళంతా చెవులు చేసుకుని విని అనందించాను. మీకు కుదిరితే ఈ రోజు రాత్రి ప్రోగ్రాం మిస్ అవకండి, నేను కూడా సాధ్యమైనంత వరకూ మిస్ అవకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను.
ఈ కార్యక్రమం నాకు ఇంతగా నచ్చడం వెనుక యాంకర్ గా సునీత పాత్ర కూడా లేకపోలేదు. గాయనీ మణుల్లో అత్యంత అందమైన, అందం కంటే కూడా మంచి కంఠస్వరం, చక్కని చీర కట్టు తో ఆకట్టుకునే సునీత గారి ప్రోగ్రాం చూస్తూ నన్ను నేను మరచిపోతుంటాను.. తన నవ్వు కూడా ఇంత లా నోరంతా తెరచి మనస్పూర్తిగా నవ్వు తూ ఎంత స్వచ్చంగా ఉంటుందో. అన్నట్లు ఎప్పటి నుండో ప్రారంభించాలి అనుకుంటున్న నా పాటల బ్లాగ్ కు మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక రూపం ఇచ్చాను. ఒక సారి అక్కడకు కూడా విచ్చేసి మీ ఆశీస్సులు అందించండి. బ్లాగ్ పేరు సరిగమల గలగలలు. ఇక్కడ క్లిక్ చేస్తే చూడవచ్చు.