పోయినేడు అనుకుంటాను వినాయకచవితి రోజు ఏదో పనిమీద సాయంత్రం ఆఫీస్ కి వెళ్ళి కాస్త ఆలశ్యంగా తిరిగి వస్తూ ఓ ముస్లిం సోదరుని ఆటో ఎక్కాను. అతను నేను రోజూ వెళ్ళే దార్లో కాకుండా కాస్త జనసమ్మర్ధం ఉండే చుట్టూ తిరిగి వెళ్ళే దారిలో తీసుకుని వెళ్తున్నాడు. "ఏంటి సోదరా ఈ రూట్ ఎంచుకున్నావ్?" అని అడిగితే "ఈ రోజు వినాయక చవితి కదా భయ్యా అసలే ఆ రూట్ నిర్మానుష్యంగా ఉంటుంది నేను ఒక్కడ్నే దొరికితే ఇక అంతే" అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను "ఛా ఊరుకోవోయ్ మనం బెంగళూరులో ఉన్నాం ఇక్కడ అలాంటి గొడవలు ఎప్పుడూ చూడలేదు ఉండవేమో కదా" అని అంటే అతను "లేదు సార్ ఈ ఏరియా విలేజే కదా ఇక్కడ వినాయకచవితి రోజు రాత్రికి ముస్లింల మీద రంజాన్ రోజు రాత్రి హిందువుల మీద దాడి చేస్తారు, మామూలు వాళ్ళకి ఏం ఉండదు కొందరు రౌడీ బ్యాచ్ ఉంటారు వాళ్ళు మందుకొట్టి వచ్చి ఎవడన్నా ఒంటరిగా దొరికితే పండగ చేసుకుంటూ ఉంటారు" అని చెప్పాడు. నేను ఔరా అనుకుని అతను క్షేమంగా ఇల్లు చేరాక ఒక మిస్ కాల్ ఇవ్వమని చెప్పి నా ఇంటికి చేరుకున్నాను. బహుశా ఈ ఏడు రెండు పండగలు ఒకే రోజు రావడం వల్ల ఎవరికి వారు పండుగ చేసుకుని ఎదుటి వాళ్ళు కూడ మంచి జోష్ మీదుంటారులే అని గొడవలు లేకుండా కామ్ గా ఉండవచ్చు అనుకుంటున్నాను.
కానీ ఈ రెండు పండుగలు ఒకే రోజు రావడం వల్ల ఒక చిన్న నష్టం కూడా ఉంది, అదేంటో చెప్తా కానీ వీడు తిండి గోల ఎత్తకుండా ఏ టపా ముగించడు కదా అని నన్ను తిట్టకండేం. నిజానికి ఈ రెండు పండుగలలో కూడా తిండికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కదా. చిన్నతనంలో ఎప్పుడూ మా ఇంటి ఎదురుగానో లేక దగ్గరలోనో తప్పని సరిగా ఒక ముస్లిం కుటుంబంతో మాకు అనుభందం ఉండేది. నర్సరావుపేటలో ఉన్నపుడు భాషా వాళ్ళు మా ఎదురింట్లోనే ఉండేవాళ్ళు రంజాన్ రోజు వాళ్ళు సేమ్యా పాయసం బిర్యానీ మరికొన్ని వంటకాలు మా ఇంటికి పంపిస్తే వినాయక చవితి రోజు గారెలు పులిహోర, పొంగలి, పూర్ణాలు, ఉండ్రాళ్ళు ఇత్యాది వంటలు వాళ్ళకు పంపించే వాళ్ళం. ఇలా ఒకే రోజు రావడం వల్ల మనకు నాన్వెజ్ బిర్యానీ టేస్ట్ చేసే అవకాశం ఉండదు కదామరి పాయసంతోనే సరిపెట్టుకోవాలి.
ఇంక ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళే అలవాటు ఉన్నవారు అయితే ఈ ఏడు బహుశా ఆ అలవాటు వాయిదా వేసుకోవలసిందే. కావాలంటే లంచ్ ఒకచోట డిన్నర్ ఒకచోట కానిచ్చేయచ్చనుకోండి. నాకు వాళ్ళింటి బిర్యానీ కానీ పాయసం కానీ ప్రత్యేకమైన రుచితో ఉండి చాలా నచ్చేవి. నాకు చిన్నప్పటినుండీ సగ్గుబియ్యంతో చేసే పాయసం చాలా ఇష్టం, గ్లాసులు గ్లాసులు నిర్మొహమాటంగా తాగేస్తాను సేమ్యాఖీర్ అంతగా ఇష్టం ఉండదు. కానీ అదేంటో వాళ్ళు ఇచ్చే ఖీర్ లో సగ్గుబియ్యం లేకపోయినా ఒక ప్రత్యేకమైన రుచితో చాలా బాగుండేది. ఇంకెక్కడ ఎన్ని చోట్ల తాగినా ఆ రుచి ఎక్కడా తగలలేదు. ఇదేమాట భాషా వాళ్ళ అమ్మగారితో అంటే ఈ సేమ్యా ఈద్ కోసం ప్రత్యేకంగా చేతి మిషన్ తో తయారు చేస్తారు అందుకేనేమో బహుశా ఆరుచి అని నవ్వేసేవారు.
మరోసారి మిత్రులందరికీ వినాయక చవితి మరియూ రంజాన్ శుభాకాంక్షలు.
టపా చదివిన ఓ స్నేహితుడు ఇప్పుడే చిన్న అనుమానం లేవనెత్తాడు. అతని సందేహం ’పండగ’ కరెక్టా ’పండుగ’ కరెక్టా అలాగే ’మిత్రులు’ కరెక్టా లేక ’మితృలు’ కరెక్టా. గూగులమ్మని అడిగితే రెండు వాడుకలకు పుట్టెడు ఉదాహరణలు చూపించింది. సో నాకు ఎలా వాడినా కరెక్టేనేమో అనిపించింది మీరేమంటారు ?
ఫోటోలు ఇక్కడ మరియూ ఇక్కడ నుండి సంగ్రహించబడినవి వారికి ధన్యవాదములు.