అయినా ఎక్కడో ఓ మంచి కథ దొరకకపోతుందా అనే ఆశతో అలా ప్రతివారం చదువుతూనే ఉన్నాను. అలాంటి టైం లో మొన్న ఆదివారం డిశంబర్ 27 సంచికలో ఓ అందమైన కథ నా కంట పడింది. చదువుతుండగా ఆహా అనిపించింది చదివిన వెంటనే ఓహో అనిపించింది. నాకు పన్నెండు ఇళ్ళు వద్దులే బాబు అటువంటిదే ఒక ఇల్లు ఉన్నా చాలు అనిపించింది. నా ఊహలను ఈ రచయిత ఎలా చదివేశాడా అనిపించింది. వెంటనే ఆ హీరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేయాలని అనిపించింది. మనసుండాలే కానీ అటువంటి జీవితం ఎప్పటికైనా ఆచరణ సాధ్యం కాక పోతుందా అనిపించింది.
ఇంకా... పెరటి గుమ్మానికి చేరగిలపడి నేను కూర్చుంటే మొదటి మెట్టుపై తను కూర్చుని మడిచిన నా కాళ్ళపై అలవోకగా వాలి నా మోకాళ్ళ పై తన తల ఆన్చిన నా శ్రీమతితో కలిసి, జాబిలి తో ఆటలాడుకుంటున్న మేఘాలనూ, పెరట్లోని మందారాల వయ్యారాలనూ పరికిస్తూ, నైట్ క్వీన్, సన్నజాజుల పరిమళాలు మట్టివాసనతో కలిసి మైమరపిస్తుంటే ఆస్వాదిస్తూ, తనకి నా స్వరంతో ఈ కథ చదివి వినిపించాలని అనిపించింది. అదిగో అందుకోసమే ఆ అనుభూతి కోసమే భద్రంగా ఈ కథను నా బ్లాగులో పదిల పరచుకుంటున్నాను.
ఇంత మంచి కథను రాసిన వట్టికూటి చక్రవర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కథకు కేవలం కన్సొలేషన్ బహుమతి తో సరిపెట్టినందుకు ఈనాడు జడ్జిలపై కాస్త కోపం వచ్చినా.. అసలు పోటీ అంటూ పెట్టి మంచి కథలు రాబట్టినందుకు ఈనాడు ఆదివారం బృందాన్ని కూడా అభినందిస్తున్నాను. ఇంతకీ ఈ కథ మీరు చదివారా... ఒకవేళ చదవకపోతే వెంటనే చదివేయండి మరి. పనిలో పనిగా వైవిధ్యభరితమైన కథ అంటూ ఈ కథకు నెమలికన్ను మురళి గారు రాసిన పరిచయాన్ని కూడా ఇక్కడ నొక్కి చదివేయండి.